mahaswami karuna
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం
ఎన్నడూ అబద్ధం చెప్పనివాడు
ఒక భక్తుడు నేపాల్ లోని పశుపతినాథ్ మందిరానికి వెళ్లి ఒక రుద్రాక్షమాలతో తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో దాన్ని తను ధరించాలని అనుకున్నాడు. మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు దాన్ని స్వామివారి ముందు ఉంచాడు. దాన్ని స్వామివారి తాకితే తనను అనుగ్రహించినట్టు అనుకున్నాడు.
“దీనితో నువ్వు ఏమి చెయ్యబోతున్నావు?” అని అడిగారు స్వామివారు.
“పెరియవ ఆశీస్సులతో దాన్ని నేను వేసుకుందామని అనుకుంటున్నాను” అని బదులిచ్చాడు.
పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.
“ఇప్పటినుండి నువ్వు అబద్దం చెప్పడం మానివెయ్యగలవా?” అని అడిగారు.
అతను ఆలోచిస్తున్నాడు. “హఠాత్తుగా ఈ ప్రశ్న ఏమిటి?”. కాని తప్పకుండా నిజమే మాట్లాడాలి ఏది ఏమైనా సరే.
“అబద్దాలు చెప్పకుండా ఉండలేను పెరియవ”
“ఏం? ఎందుకు?”
“నేను ఒక బ్యాంకు ఉద్యోగిని. కొద్దిగా అబద్దాలు వాడకుండా రికార్డ్స్ తయారుచెయ్యడం కుదరదు. వాటిని ఎలా తయారుచెయ్యాలో నా పై అధికారులు సూచిస్తారు. నేను కాదనలేను”
స్వామివారు ఆ రుద్రాక్ష మాలను తీసుకుని కాసేపు చేతులతో త్రిప్పుతూ, కొద్దిసేపటి తరువాత, “మరైతే ఎవరు అబద్దం ఆడరో వారికి దీన్ని ఇవ్వు” అని ఆదేశించారు.
అతను ఆశ్చర్యపోయాడు. అక్కడున్న సేవకులతో, “అచ్చంగా నా భార్య సూచించినట్టుగానే జరిగింది” అని అన్నాడు.
ఇతను యాత్ర ముగించుకుని ఆ రుద్రాక్ష మాలతో వచ్చిన తరువాత అతని భార్య అతనితో పూజ గదిలో ఉన్న పరమాచార్య స్వామివారి చిత్రానికి మాలగా వెయ్యమని చెప్పింది.
“పరమాచార్య స్వామివారు చెప్పినట్టే చేస్తాను” అని అతను రుద్రాక్ష మాలను ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే ఆ మాలను పరమాచార్య స్వామివారి చిత్రపటానికి అలంకరించాడు. తన ఇంటిలో ఎప్పుడూ అబద్ధం చెప్పని ఒక వ్యక్తీ ఉన్నారని ఆరోజే అతనికి అర్థం అయ్యింది.
అతని భార్య కోరికను పరమాచార్య స్వామివారు తీర్చారు. ఆమె కోరిక స్వామివారికి ఎలా తెలిసింది? టెలిపతి గురించి అందరకూ తెలిసిందే. కాని ఇది కేవలం గురుభక్తి. తరువాత ఒకసారి ఆ భక్తుని బంధువు ఒకరు దర్శనానికి వచ్చినప్పుడు అతని గురించి గొప్పగా చెబుతూ, “అతనిలో హరిశ్చంద్రుని పార్శ్వము కూడా ఉంది” అని అన్నారు మహాస్వామివారు.